అధికార దర్పానికి నిజాయితీకి జరిగిన ఎన్నికలు - సురేష్ నాయుడు
- PRASANNA ANDHRA

- May 17, 2024
- 1 min read
అధికార దర్పానికి నిజాయితీకి జరిగిన ఎన్నికలు - సురేష్ నాయుడు


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఈనెల 13వ తేదీ జరిగిన ఎన్నికలలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజల స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఇది ఓర్వలేని వైసిపి, టిడిపి నాయకులు, పోలింగ్ ఏజెంట్లు, కార్యకర్తలపై దాడులు చేశారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి సురేష్ నాయుడు కొరపాడు రోడ్డులోని అన్న క్యాంటీన్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో అన్నారు. గతంలో టిడిపిని భూస్థాపితం చేస్తామన్న ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే రాచముల్లు శివ ప్రసాద్ రెడ్డికి దారుణ ఓటమి తప్పదని, భారీ మెజారిటీతో ఇక్కడ టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజులు రెడ్డి గెలవనున్నట్లు ఆయన జోస్యం చెప్పారు.

వైసిపి పతనం మొదలైందని, బాబుపై రాచమల్లు చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఇకపై టిడిపి నాయకులను కాని కార్యకర్తలను గాని విమర్శిస్తే ఓర్చుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో పాల్గొన్న టిడిపి నాయకులు ఇవి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అలాగే నియోజకవర్గంలో రాచమల్లు శకం ముగిసిందని, భారీ ఓట్ల మెజారిటీతో వరద గెలవనున్నట్లు అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ, మే 13న జరిగిన ఎన్నికలు అధికార దర్పానికి నీతి నిజాయితీకి జరిగిన ఎన్నికలుగా ఆయన అభివర్ణిస్తూ, నిజాయితీ గల టిడిపి అభ్యర్థి వరదకు ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలుపు దిశగా పయనింప చేశారని ప్రజలకు కృతజ్ఞత తెలియజేశారు.

దౌర్జన్యకాండ సృష్టించి ఈ ఎన్నికలలో వైసిపి గెలవాలని పన్నాగాలు పన్నినట్లు, వైసిపి నాయకులు ఓటమి చవిచూస్తున్నప్పటికీ ఇంకా దాడులు ఆగలేదని, ఇకనైనా వైసీపీ నాయకులు ఇలాంటి దుశ్చర్యలు ఆపకుంటే రానున్న రోజులలో ప్రతిచర్యలు దాడులు తప్పవని వి.ఎస్ ముక్తినార్ ఘాటుగా హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్ మునీర్, మాజీ కౌన్సిలర్ అంజి, మహిళా నాయకురాలు భోగాల లక్ష్మీనారాయణమ్మ, మాజీ జెడ్పిటిసి వెళ్లాల భాస్కర్, జనసేన నాయకులు జిలాన్, మాజీ కౌన్సిలర్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.











Comments