ఆరోపణ ప్రత్యారోపణల నడుమ కొత్తపల్లె పంచాయతి సాధారణ సమావేశం
- PRASANNA ANDHRA

- Jul 19, 2023
- 1 min read
ఆరోపణ ప్రత్యారోపణల నడుమ ముగిసిన కొత్తపల్లె పంచాయతి సాధారణ సమావేశం

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లి పంచాయతీ కార్యాలయం నందు బుధవారం ఉదయం సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అధ్యక్షతన, డి.ఎల్.పి.ఓ మస్తాన్ వల్లి నేతృత్వంలో గ్రామపంచాయతీ సాధారణ సమావేశం నిర్వహించారు. పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల నడుమ సమావేశం ప్రారంభం కాగా, అజెండాలో చర్చనీయాంశాలుగా 76 అంశాలు చర్చకు రాగా, వాటిలో ఒక్క అంశము మినహా అన్ని అంశాలు ఆమోదించబడ్డాయి. సమావేశం నందు ఒకానొక సందర్భంలో సర్పంచ్ కొనిరెడ్డి పంచాయతీ సెక్రెటరీ గురు మోహన్ పై విమర్శలు గుప్పిస్తూ, ప్రజలకు సెక్రటరీ అందుబాటులో ఉండటం లేదని, పలుమార్లు ప్రజలు ఆయన వద్దకు రాగా తీసివేత ధోరణితో వ్యవహరిస్తూ అటు పంచాయతీకి ఇటు తనకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే పంచాయతీ పరిధిలోని పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు, తన ప్రమేయం లేకుండా తనను దిక్కార స్వరముతో పలువురి వద్ద మాట్లాడినట్లు ఆరోపణలు గుప్పించారు. ఈ విషయమై కడప జిల్లా కలెక్టర్ కు కొనిరెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
సమావేశం జరుగుతున్న సమయంలో ఒకానొక సందర్భంలో యుద్ధ వాతావరణం నెలకొన్నదనే చెప్పాలి. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటూ సాగిన సమావేశం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. అనంతరం సెక్రెటరీ గురు మోహన్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని, ఎల్లవేళలా పంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన సేవలు చక్కబెడుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.








Comments